తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-I మెయిన్తో సహా మిగిలిన అన్ని రిక్రూట్మెంట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిస్థితులపై మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, పేపర్ లీకేజీపై అనవసరపు వదంతులు నమ్మొద్దని ఉద్యోగార్థులకు విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రకటించినట్లు వచ్చే మే 5న గ్రూప్-1తో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తామని వెల్లడించిన ఆయన టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని ముందుగా తామే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 12న జరగాల్సిన టీపీబీవో పరీక్షను, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశామని చైర్మన్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. కాగా పరీక్షా పేపర్ల లీకేజీలో రాజశేఖర్ రెడ్డి అనే నెట్వర్ ఎక్స్పర్ట్గా పనిచేసే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ హస్తం ఉందని, ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలారని చెప్పారు. ఏఈ పరీక్ష పేపర్ల లీక్పై న్యాయ సలహా తీసుకొని పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకొంటామని తెలియజేశారు. ఇక టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దాదాపు 30 లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారని, ఒక్కసారి ఓటీఆర్ చేసుకొంటే భవిష్యత్తులో ఏ ఉద్యోగానికైనా సులభంగా దరఖాస్తు చేయవచ్చని, మరోసారి వివరాలేవీ నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE