యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడం సాధ్యమేనని మరోసారి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు ప్రాంతీయ ఇన్చార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమైన పని కాదని, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరిస్తే ఇది జార్జి తీరుతుందని పార్టీ కార్యకర్తలతో అన్నారు. అయితే పార్టీలోని ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా ఐక్యంగా పనిచేయాలని, అప్పుడే అది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదని, అలాగే మంత్రివర్గ మార్పులూ లేవని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 98 శాతం హామీలను అమలు చేశామని పునరుద్ఘాటించిన ఆయన , వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంతో పార్టీ క్యాడర్ కృషి చేయాలని సూచించారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 87శాతం మందికి సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అందించబడ్డాయని, వీటిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఇక ఇంటింటికీ ప్రచారంలో పాల్గొంటూనే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తమ పరిధిలో పథకాలు అందని వారిని గుర్తించాలని, తదుపరి దశల్లో అర్హతను బట్టి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. లబ్ది చేసిన 80 లక్షల కుటుంబాల్లో కేవలం 2.5 లక్షలు మాత్రమే ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నారని, వాళ్లంతా రకరకాల యూనియన్లకు చెందిన వారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక ఆ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసిందని, అయితే టీడీపీ ఇతర యూనియన్లతో అవగాహన కుదుర్చుకుందని, అందుకే ఆ పార్టీ మొదటి ప్రాధాన్యతతో కాకుండా రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచిందని చెప్పారు. ఎవరికైతే మంచి చేశామో వారిలో ఎమ్మెల్సీ ఓటర్లలో తక్కువ మంది ఉన్నారని, ఈ ఎన్నికలు ఏ రకంగాను శాంపిల్ కాదని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు చేరవేసేందుకు, అదే సమయంలో వారి నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు గానూ గత కొన్ని నెలలుగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE