కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ కోసం సోమవారం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడి, వయసురీత్యా దీక్ష విరమించాలని సూచించగా, ఆయన సానుకూల స్పందించి దీక్షను విరమించుకున్నారు. ఏలూరు ఆసుపత్రిలోనే హరిరామ జోగయ్య నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.
బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) రిజర్వేషన్లు కాపులకు వర్తింపచేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్షకు సయామత్తం అవుతున్న హరిరామ జోగయ్యని ముందుగానే ప్రభుత్వం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిందనే వార్తను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లో హరిరామ జోగయ్యని పరామర్శించారు.
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్న ఆయన్ని, వయసురీత్యా వెంటనే దీక్షను విరమించాలని, మందులు వేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడుదామని చెప్పారు. దయచేసి దీక్ష విరమించాలని, ఆశయ సాధన కోసం కలిసి కూర్చొని ఎలా ముందుకు వెళ్లాలో చర్చిద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ క్రమంలో హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ సూచనలకు సానుకూలంగా స్పందిస్తూ దీక్షను విరమించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE