ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇకపై రాష్ట్రంలోని జాతీయ, మున్సిపల్, పంచాయతీ రాజ్ రహదారులపై మరియు రోడ్డు మార్జిన్ల వద్ద సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ హోమ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఏపీలోని కందుకూరులో సభలో, గుంటూరులో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట సంభవించి ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కాగా అరుదైన మరియు అసాధారణమైన పరిస్థితులలో వ్రాతపూర్వకంగా నమోదు చేయబడిన కారణాలతో మాత్రమే జిల్లా ఎస్పీలు లేదా కమిషనర్లు పూర్తి షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని తెలిపారు.
రోడ్లపై బహిరంగ సభలు ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో బహిరంగ సభల్లో ప్రజలకు గాయాలు మరియు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఇరుకైన రోడ్లు వలన, ఎగ్జిట్ పాయింట్లు ఎక్కువ లేకపోవడం మరియు ఆకస్మికంగా రద్దీ పెరగడం వలన రద్దీని నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, అలాగే మున్సిపల్, పంచాయతీ రోడ్లపై కూడా సభలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల తరలింపు మరియు ఇతర విధులకు సభలు ఆటంకం కలిగించకూడదన్నారు.
అలాగే సభలు నిర్వహించుకునేందుకు రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బందిలేని విధంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలనీ జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా కలిగించకుండా ఎంపిక చేసిన ప్రదేశాల్లో సభల నిర్వహణకు అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE