తెలుగు దేశం పార్టీపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అనడంతో.. పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈ పరిణామాలపై కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు విస్మరించారని ఆరోపించారు. టీడీపీ.. జనసేనకు తక్కువ సీట్లు ఇవ్వాలని చూస్తోందని అన్నారు. జనసేనకు ఇరవై అయిదు నుంచి ముప్పై సీట్లు ఇస్తే విఫల ప్రయోగమే అవుతుందని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు.
తెలుగు దేశం పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని హరిరామ జోగయ్య భగ్గుమన్నారు. పొత్తు ధర్మానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారన్న హరిరామ జోగయ్య.. పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకు పోవడమే దీనికి కారణమా అని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను టీడీపీ మానుకోవాలని హెచ్చరించారు. జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డంకి అని అన్నారు. ఇకపై టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే క్యాడర్ ఊరుకోబోదని అన్నారు.
పవన్ కళ్యాణ్కు చెప్పకుండా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను మండపేట, అరకు నియోజకవర్గాలకు ప్రకటించడం పొత్తు ధర్మాన్ని విస్మరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. రాజోలు, రాజానగరం సీట్లను పవన్ ప్రకటించినప్పటికీ జనసేన కార్యకర్తలు సంతృప్తి చెందలేదని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాలను జనసేనకు ప్రకటించినట్లయితే పవన్ కల్యాణ్కు ఎంత నిబద్దత ఉందో తేటతెల్లమయ్యేదని హరిరామ జోగయ్య చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఓట్లు బదిలీ కావాలంటే జనసేనకు అధిక సీట్లు టీడీపీ కేటాయించాల్సిందేనని హరిరామ జోగయ్య తేల్చేశారు. జనసేనకు యాభై అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్కువ స్థానాలను పవన్ అంగీకరిస్తే సదరు పొత్తు విఫల ప్రయోగంగా మారే ప్రమాదం ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY