ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ..తమ కూటమి గ్రాండ్ సక్సెస్ అయి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని టీడీపీ,జనసేన అధినేతలు పెంచుకుంటున్నారు. అయితే కేవలం 24 అసెంబ్లీ సీట్లకే జనసేన పరిమితమవడంపై చాలా చోట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ స్థానాల ద్వారా కాపు సామాజిక వర్గం ఓటు బదలాయింపు పూర్తిగా జరిగే అవకాశం ఉండదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కాపు సంఘం నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున లేఖాస్త్రాలు కూడా సంధించారు. దీంతోనే తాజాగా జరిగిన తాడేపల్లి గూడెం సభలో ..తనతో ఉన్నవారే తనవారని.. ఇష్టం లేని వాళ్లెవరయినా బయటకు వెళ్లిపోవచ్చని కూడా తేల్చి చెప్పారు. ఈ సమయంలోనే హరి రామ జోగయ్య,ముద్రగడ కుటుంబాలు వైసీపీ వైపు వెళ్లడంతో.. కుల చిచ్చు రగిలించేందుకు కొంతమంది రెడీ అవుతున్నారన్న చర్చ నడుస్తోంది.అందులోనూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొన్న కొంతమంది.. కాపు, కమ్మ కులాల మధ్య అంతరం పెంచేలా చర్యలు ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ లందరికీ తమ పార్టీ టికెట్లు ఇస్తుందని చంద్రబాబు ప్రకటించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును జనసేన ఆశిస్తుండడాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ వర్గాలు రెడీ అయ్యాయి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని చెప్పారు. అంతేకాకుండా 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కందుల దుర్గేషే తమ అభ్యర్థి అని ప్రకటించిన దగ్గర నుంచి వివాదానికి తెర లేపారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాగా..కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ఇద్దరు కూడా బలమైన నేతలే. ఎవరు పోటీ చేసినా సరే పొత్తులో భాగంగా తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం ఉంది. కాకపోతే చంద్రబాబు సూచనతో పవన్ దుర్గేష్ తో మాట్లాడి.. రాజమండ్రి రూరల్ సీటుకు బదులు నిడదవోలు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనిపై దుర్గేష్ సమాధానం ఇవ్వకుండా.. తన అనుచరులతో మాట్లాడి చెప్పి రోజులు గడుస్తున్నా కూడా దుర్గేష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించలేదు. దీంతో దుర్గేష్ కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే పోటీ చేయడానికి పంతం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సాకుగా తీసుకున్న కొంతమంది వైసీపీ నేతలు అక్కడ కుల రాజకీయాన్ని తెరపైకి తీసుకురావడంతో టీడీపీ, జనసేన కూటమిలో ఆందోళన కలిగిస్తోంది.
నిజానికి టీడీపీతో, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలలో ముందుకు వెళితే జరిగే నష్టం గురించి వైసీపీకి బాగా క్లారిటీ ఉంది. ఒకవేళ పొత్తు కుదిరినా సీట్ల సర్దుబాటు దగ్గర ఎలా అయినా వివాదం వస్తుందని..అప్పుడు తమకు అనుకూలంగా మార్చుకుందామని ఎదురుచూస్తోంది. పవన్ తీసుకున్న 24 సీట్ల దగ్గర నుంచి ఆశావహుల వరకూ ప్రతీ అంశాన్ని తీసుకుని రెండు పార్టీల మధ్య వివాదం సృష్టించడానికి రెడీ అయిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కాపు సంఘాల నేతల లేఖలు వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమ్మ వర్సెస్ కాపు వివాదాన్ని మరింత ముదిరేలా చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE