అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 94 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే కొందరు సీనియర్లను చంద్రబాబు పక్కకు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారిని కావాలనే సైడ్ చేశారా?.. వారంతా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనా? అనే అనుమానం తెరపైకి వచ్చింది.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో కీలక నేత సుజయ క్రిష్ణ రంగారావు. వచ్చే ఎన్నికల్లో ఆయన బొబ్బిలి టికెట్ ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈసారి క్రిష్ణరంగారావును సైడ్ చేసి.. ఆ టికెట్ను ఆయన సోదరుడు బేబీ నాయనకు ఇచ్చారు. ఈక్రమంలో సుజయ క్రిష్ణ రంగారావు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనా అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. అదే జిల్లాలో మరో దమ్మున్న నేత అశోక్ గజపతి రాజు. ఈయన గతంలో కేంద్రం మంత్రిగా కూడా పనిచేశారు. గత నాలుగు దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను శాసిస్తున్నారు.
అశోక్ గజపతి రాజు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ హైకమాండ్ ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను విజయనగరం నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అశోక్ గజపతిరాజుకు కూడా ఈసారి నిరాశ తప్పదని.. ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈసారి పొత్తులో భాగంగా నెలిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఆ టికెట్ ఆశిస్తున్న సీనియర్ మోస్ట్ లీడర్ పతివాడ నారాయణస్వామికి కూడా నిరాశ తప్పదని తెలుస్తోంది.
టీడీపీలో మరో సీనియర్ లీడర్ కిమిడి కళా వెంకటరావు. 1983 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వెంకటరావు.. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టికెట్ ఆశిస్తున్నారు. కానీ టీడీపీ హైకమాండ్ ఎచ్చెర్ల నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని చూస్తోంది. అదే సమయంలో వెంకటరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది. కానీ వెంకటరావు మాత్రం చీపురుపల్లికి వెళ్లే ప్రసక్తే లేదని.. ఎచ్చెర్ల నుంచే పోటీ చేస్తానని అంటున్నారు. అటు హైకమాండ్ ఎచ్చెర్ల టికెట్ వెంకటరావుకు ఇచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. ఈక్రమంలో వెంకటరావుకు కూడా ఈసారి నిరాశ తప్పదని తెలుస్తోంది.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. కానీ పెందుర్తిని జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో సత్యనారాయణకు కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అటు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం టికెట్ ఆశిస్తున్నారు. కానీ టీడీపీ హైకమాండ్ ఆయనకు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఈసారి ఆ స్థానం నుంచి యువనేత గోండు శంకర్ను బరిలోకి దించేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. దీంతో సూర్యనారాయణకు కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి అయిదారుగురు టీడీపీ సీనియర్ నేతలకు ఈసారి టికెట్ కష్టమేనని.. వారంతా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE