తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు నరసరావుపేటలో నిర్వహించనున్నారు. నరసరావుపేటలో ఉదయం 11 గంటల నుంచి కోడెల అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. కోడెల అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. అంత్యక్రియల ఊరేగింపులో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రీజ్ లాల్ స్పష్టం చేసారు. మంగళవారం నాడు కోడెల అంత్యక్రియలను అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ లాంఛనాలను కోడెల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వద్దని, పార్టీ అభిమానుల మధ్యనే జరపాలని కోడెల కుటుంబసభ్యులు, టీడీపీ నిర్ణయించారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం రాత్రి నరసరావు పేటలో ప్రకటించారు.
మంగళవారం నాడు కోడెల భౌతికకాయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉంచారు. గుంటూరు లోని టీడీపీ కార్యాలయానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీగా వచ్చిన అభిమానులను నియంత్రించలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. అనంతరం రాత్రి 8.30 నిముషాలకు పార్దీవదేహాన్ని నరసరావుపేటకు తరలించారు. ఈ రోజు పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులు హాజరవనున్నారు.
[subscribe]