భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడ పడకుండానే రద్దు అయింది. సెప్టెంబర్ 17, బుధవారం నాడు మొహాలీలో రాత్రి 7 గంటల నుంచి రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు పూర్తి ఉత్సాహంతో మ్యాచ్ కు సిద్ధమవుతున్నారు. గతంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టీ20 మ్యాచుల్లో కూడ భారత్ కు పరాజయం ఎదురైంది, ఈసారి రెండు మ్యాచుల్లో విజయం సాధించి సత్తా చాటాలని ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు.
ఈ టీ20 సిరీస్ లో రిషబ్ పంత్, మనీష్ పాండే లపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్ లలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ ఇచ్చేస్తున్నాడనే విమర్శలు ఎదురుకుంటున్న రిషబ్ పంత్ కి, పదే పదే అదే పద్ధతిలో వికెట్ కోల్పోతే సహించేదిలేదని టీం మేనేజ్ మెంట్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే లకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. మిడిల్ ఆర్డర్ లో సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు వెస్టిండీస్ సిరీస్ లో విఫలమైన శిఖర్ ధావన్ ఈ సిరీస్ లో తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్ కు అందుబాటులో లేరు, నవదీప్ సైని, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్ లాంటి యువ బౌలర్లపైనే జట్టు ఆధారపడివుంది. సెప్టెంబర్ 22న బెంగుళూరులో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.