ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత విష్ణు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. వీరిలో డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, ప్రభాస్, మహేష్ బాబు, అలీ, ఆర్ నారయణ మూర్తి, పోసాని ఉన్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల సమావేశం అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణు సీఎం జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం జగన్ తో భేటీ అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ను తాను కేవలం వ్యక్తిగతంగా కలవటానికి వచ్చాను అని మంచు విష్ణు తెలిపారు. సీఎం జగన్ గారితో మాకు బంధుత్వం ఉంది. నేను ఆయనను అన్న అనే సంబోధిస్తాను. జగన్ అన్నతో లంచ్ చేయటం కోసం వచ్చాను. అలాగే, సినీ పరిశ్రమలోని సమస్యల గురించి కూడా మా మధ్య చర్చకు వచ్చింది. వాటిని పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని వివాదాలు పరిష్కారం కానున్నాయని తెలిపారు. అలాగే, మంత్రి పేర్ని నాని గారు, మా నాన్న గారు మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. కేవలం ఆ సాన్నిహిత్యంతోనే మా ఇంటికి ఆయన వచ్చారని మంచు విష్ణు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ