ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిర్ధేశిత రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టులో దౌత్యపరమైన అవగాహన కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం దాదాపు 69 వేల ఎకరాల పారిశ్రామిక భూమి ఉందని, పెట్టుబడులకు ఎవరు ముందుకొచ్చిన సంతోషంగా ఆహ్వానిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల షిప్పింగ్ పోర్టులు నిర్మిస్తున్నామని తెలిపారు.
విశాఖ కేంద్రంగా మార్చి 3, 4 తేదీల్లో జరుగనున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, ప్రపంచంలోని పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారని, ఈ సమావేశానికి 48 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం తరపున సహకారం అందిస్తామని, వారి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే నీతి ఆయోగ్ వంటి కేంద్ర సంస్థలు సైతం ఏపీ విధానాలను ప్రశంసిస్తున్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గడచిన మూడేళ్ళుగా దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో కొనసాగుతోందని ఆయన తెలియజేశారు. ఇక విశాఖ గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE