ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులుతో బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి మంత్రి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మొత్తం 16,208 పోస్టులకు 10,56,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మొత్తం 7 రోజుల పాటు జరగనుండగా, 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి రోజున 6,81,664 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఉదయం 2,221 పరీక్షా కేంద్రాలలో, మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. పరీక్షల సందర్భంగా కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్ రూములు సిద్దం చేశామని, పరీక్ష నిర్వహించే సిబ్బంది పీపీఈ కిట్ లు ధరించి ఐసోలేషన్ రూములలో విధులు నిర్వర్తిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu