జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 15, శనివారం నాడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపడుతున్న రైతులను కలుసుకుని వారికీ పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలుపుతున్నారు. దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు మొదలైన పవన్ పర్యటన ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో కొనసాగనుంది.
ఈ సందర్భంగా ఎర్రబాలెం రైతులతో మాట్లాడుతూ, భూమిలు ఇచ్చి నష్టపోయినా రైతులకు భరోసాగా ఉంటామని చెప్పారు. భవిష్యత్తులో ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ మాత్రం మీకు కచ్చితంగా అండగా ఉంటుందని అన్నారు. అప్పట్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసే అమరావతిని రాజధానిని చేశాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మరోవైపు ఫిబ్రవరి 16, ఆదివారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు రేపల్లె జనసేన పార్టీ కార్యకర్తలతో, మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండుగంటలకు పార్టీలోని కీలక నాయకులతో పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే మూడుగంటలు జనసేన లీగల్ విభాగం సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
[subscribe]