జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన రాజు రవితేజ్ డిసెంబర్ 13, శుక్రవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న రాజు రవితేజ్ పార్టీకీ గుడ్బై చెబుతూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజు రవితేజ్ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ , పవన్ కళ్యాణ్ తో గాని, జనసేన పార్టీతో గాని ఇక నుండి ఎటువంటి సంబంధం లేదని, ఉండబోదని అందరూ గమనించాలని కోరారు. ‘ పార్టీ భావజాలం, పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించి, జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిని. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఇక మీదట నేను వారితో కలిసి పనిచేయను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతన్ని అనుమతించకూడదు. పవన్ కల్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదని’ రాజు రవితేజ్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. అలాగే శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాకు గల పూర్తి కారణాలను రాజు రవితేజ్ వివరించే అవకాశమునట్టుగా తెలుస్తుంది.
మరో వైపు జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ పార్టీకి రాజీనామా ప్రకటించడంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ‘రాజు రవితేజ పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాం. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదన, అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. గతంలోనూ ఆయన ఇటువంటి బాధనే వ్యక్తపరుస్తూ పార్టీని వీడి, తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయన కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
[subscribe]