విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 న జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని, రూ.50 లక్షల పరిహారాన్ని అందిస్తామని ఆ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు చెక్కులు అందజేశారు. రాష్ట్ర మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ఇప్పుడు ఆరు కుటుంబాలకు చెక్కులు అందజేశామని, సాయంత్రం మరో మూడు కుటుంబాలకు మచిలీపట్నంలో చెక్కులు అందిస్తామని అన్నారు. అలాగే మరొకరు గర్భిణీ కావడంతో కలెక్టర్ వారి ఇంటికి వెళ్లి చెక్కును అందజేస్తారని చెప్పారు.
కరోనా చికిత్సలో భాగంగా రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించింది. ప్రమాదం అనంతరం ఈ ఘటనపై విచారణ నిమిత్తం ప్రభుత్వం రెండు కమిటీలను నియమించి పూర్తి వివరాలను సేకరించింది. అలాగే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, జడ్జి వారికీ 14 రోజుల రిమాండ్ విధించడంతో, మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు తరలించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu