ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి కోర్సులకు సంబంధించి విద్యార్థులకు ఈ పథకంతో మేలు కలుగుతుందని వారు తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి, అది కూడా 35 ఏళ్లలోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించింది ప్రభుత్వం.
నాలుగు వాయిదాల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేస్తారు. ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు లభించాక మొదటి వాయిదా, ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. అలాగే రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా, నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లించనున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు-డిసెంబరు మరియు జనవరి-మే నెలల మధ్య అర్హత కలిగిన విద్యార్థుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఈ విద్యార్థులను ఎంపిక చేస్తుంది.
క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల చదువులకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అలాగే టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రపంచం లోని టాప్ 100 – 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు రూ. 50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ అందించనుంది. ఈ క్రమంలో ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ