టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలలో పర్యటిస్తున్నారు. మొన్న విశాఖపట్నంలో పర్యటించిన ఆయన తాజాగా నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్యటనలో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు ఆయన నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర తన సెల్ఫోన్తో సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను ఉద్దేశించి ‘చూడు.. జగన్! ఇవే టీడీపీ హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు. ఏపీలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?’ అని ప్రశ్నించారు. దీనిని సీఎం జగన్కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులపై వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే పార్టీ క్యాడర్కు, లీడర్స్కు చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE