ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.. రేపు ప్రారంభించేది రెండోది కావడం విశేషం. రేపు ఉదయం ప్రధాని మోదీ ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాగా ఈ ట్రైన్లో అత్యాధునిక సదుపాయాలు ప్రయాణికులకు అందించనున్నారు. ఇక దీనిలో మొత్తం 4 చైర్ కార్, 4 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కారు కోచ్లు ఉంటాయి. ట్రైన్ లోపల వైఫై సౌకర్యంతో పాటు ప్రతి కోచ్లో 4 ఎమర్జన్సీ లైట్లు ఏర్పాటుచేశారు. అలాగే కోచ్లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దీనిపై రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ప్లే అవుతాయి. 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు ఈ ట్రైన్ ప్రత్యేకత. ముఖ్యంగా ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా కవచ్ టెక్నాలజీని వినియోగించి రూపొందించారు. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్తో రూపొందించిన బోగీల కారణంగా రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు.
వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయం ఇలా..
- వారంలో మంగళవారం రోజు మినహా మిగిలిన 6 రోజులు సర్వీసులు నడుస్తాయి.
- ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మద్యాహ్నం 2:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
- మళ్లీ సాయంత్రం 3:15 గంటలకు తిరుపతి నుంచి రిటర్న్ బయలు దేరి అర్ధరాత్రి 11:45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిన ప్రకారం టికెట్ల ధరలు ఇలా..
- సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఏసీ ఛైర్కార్ – రూ.1680.
- ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ – రూ.3080.
- తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ఏసీ ఛైర్కార్ – రూ.1625.
- ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ – రూ.3030.
ఇక సికింద్రాబాద్-తిరుపతి టికెట్ ధరలను పరిశీలిస్తే బేస్ ఫేర్ రూ.1168 ఉండగా… సూపర్ ఫాస్ట్ ఛార్జీ రూ.45, రిజర్వేషన్ ఛార్జీ రూ.40, టోటల్ జీఎస్టీ రూ.63లుగా నిర్ణయించారు. అలాగే రైలులో అందించే ఆహార పదార్ధాలకు రూ.364 చొప్పున ఒక్కో పాసింజర్ నుంచి క్యాటరింగ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. మరోవైపు తిరుపతి- సికింద్రాబాద్ ట్రైన్లో బేస్ ఛార్జీ రూ.1169 ఉండగా.. కేటరింగ్ ఛార్జీ రూ.308గా ఉంది. దీంతో రాను, పోను ఛార్జీల్లో స్వల్ప తేడాలు కనిపించాయి.
సికింద్రాబాద్ నుంచి ఒక్కో స్టేషన్కు ఛైర్కార్ ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..
- సికింద్రాబాద్-నల్గొండ – రూ.470.
- సికింద్రాబాద్-గుంటూరు – రూ.865.
- సికింద్రాబాద్-ఒంగోలు – రూ.1075.
- సికింద్రాబాద్-నెల్లూరు – రూ.1270.
ఎగ్జిక్యూటివ్ సెక్షన్ ఛార్జీలు ఇలా ఉన్నాయి..
- సికింద్రాబాద్-నల్గొండ – రూ.900.
- సికింద్రాబాద్-గుంటూరు – రూ.1620.
- సికింద్రాబాద్-ఒంగోలు – రూ.2045.
- సికింద్రాబాద్-నెల్లూరు – రూ.2455.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE