ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఆయన ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో పంటు ఢీ కొనడంతో బోటు ఒక పక్కకు ఒరిగిపోయి అకస్మాత్తుగా అందరూ నదిలో పడిపోయారు. కాగా ఈ ప్రమాదంలో లాంచీలో చంద్రబాబు సహా 15 మంది వరకు ఉన్న మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు సహా అందరూ నీటిలో మునిగారు.
అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు వారిని నది నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మానేపల్లి వరదల సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మర పడవలో వెళ్తుండగా.. ఆయనతో పాటు మరో పడవలో ఎక్కేందుకు టీడీపీ నేతలు పలువురు పంటు చివరకు రావడంతో అది అదుపు తప్పి మరో బోటుని ఢీ కొంది. దీంతో వారందరూ ఒక్కసారిగా నదిలో పడిపోయారు.
అయితే అదృష్టవశాత్తూ నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో వెంటనే లైఫ్ జాకెట్లు ఉపయోగించి అందరినీ రక్షించగలిగారు. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ సమయంలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు మరికొందరు మీడియా ప్రతినిధులు మరియు భద్రతా సిబ్బంది ఉన్నారు. కాగా ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత చంద్రబాబు బృందం రాజోలులంకకు బయలుదేరి వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ