‘ప్రజా రాజధాని-అమరావతి’ పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. జనసేన, లోక్సత్తా, సీపీఐ, బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఆమ్ఆద్మీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో పలు ఇతర పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ప్రాంతంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, అసలు అమరావతిలో ఏం జరుగుతోందో తెలియజేయడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. అమరావతి ప్రాజెక్టు చేపట్టడం తప్పని ప్రజలు అంటే, అందుకు క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
అమరావతిపై అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలంతా ఈ విషయంపై చైతన్యవంతంగా స్పందించాలని కోరారు. రాజధానిలో నిర్మాణ పనులు జరుగుతున్నపుడు ప్రతి రోజూ 50 వేల మందికి పైగా పనిచేసేవారు. ఇప్పుడు అక్కడ పనులన్నీ ఆగిపోయాయని అన్నారు. తెలుగు బిడ్డలు గర్వించే విధంగా అమరావతి నిర్మాణాన్ని తలపెట్టామని, హైదరాబాద్ కన్నా గొప్పగా, పెద్ద స్థాయిలో అమరావతిని నిర్మించుకునే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానిపై గందరగోళానికి స్పష్టతనిస్తూ, ఈ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఒకవేళ రాజధాని నిర్మాణంలో ఏదైనా అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం భావిస్తే విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అన్నిపార్టీల నాయకులతో కూడిన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర సమస్యలపై సీఎం వైఎస్ జగన్ పోరాటం చేయాలని బొలిశెట్టి సత్యనారాయణ సూచించారు.
[subscribe]