తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ కేసులో నిందితులను డిసెంబర్ 6, శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 4 గంటల సమయంలో నిందితులు మహమ్మద్ ఆరీఫ్ పాషా, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులను దిశను దహనం చేసిన షాద్నగర్ దగ్గరలోని చటాన్ పల్లి బ్రిడ్జి కింద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వద్ద నిందితులు ఆయుధాలు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించగా ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో, నలుగురు నిందితులు చనిపోయినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ను సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్ధారించారు. ఈ ఘటన చటాన్పల్లి వద్ద చోటుచేసుకుందని, తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు.
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తె విషయంలో 10రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకున్నారని, నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు పోలీసులను అభినందించారు. నలుగురు నిందితుల ఎన్కౌంటర్తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చటాన్పల్లి వంతెన వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజలు ‘తెలంగాణ పోలీస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్కౌంటర్ తో దిశకు న్యాయం జరిగిందంటూ పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు నలుగురు నిందితులకు ఘటన స్థలంలోనే రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఒక్కో మృతదేహానికి ఒక్కో తహసీల్దార్ సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. ముందుగా పోస్టుమార్టం కూడా ఘటన స్థలంలో నిర్వహించాలనుకున్న పోలీసులు నిర్ణయాన్ని మార్చుకుని, నలుగురి మృతదేహాలను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది.
[subscribe]