అధికారం తనకు కొత్త కాదని, అయితే తన బాధ, ఆవేదన అంతా రాష్ట్రం బాగు కోసమేనని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించానని, టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులు 72 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండర్ తీసుకొచ్చారని, ఈ మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్ కూడా బాగు చేయలేక పోయారని విమర్శించారు. భూమి కోల్పోయిన నిర్వాసితులను కూడా ఆదుకోలేదని, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశం అని, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించొద్దని కోర్టులో చెప్పారని, అయితే వివేకా కుమార్తె సునీత దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణకు అనుమతి తెచ్చుకున్నారని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో విచారణ సరిగా జరగడం లేదని, తనకు అనుమానాలున్నాయని మళ్ళీ సుప్రీంకు వెళ్లి విచారణను తెలంగాణకు బదిలీ చేయించుకున్నారని తెలిపారు. సుప్రీం నిర్ణయం సీఎం జగన్కు చెంప పెట్టులాంటిదని, దీనిపై ఆయన ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు కొందరు హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, వారు ఇప్పుడు తన తనయుడు లోకేశ్ను లక్ష్యంగా చేసుకున్నారని తెలియజేశారు. అయితే ఇలాంటివారిని తన రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశానని, తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదని స్పష్టం చేశారు. తన పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందన చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE