తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు కు ప్రమాదం తప్పింది. నవంబర్ 29, శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలో డ్రైవర్ కారును పక్కకు పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నటుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు ఎడమ చేతికి స్వల్పగాయమైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం కొంచెం దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే నక్కపల్లి సీఐ విజయ్కుమార్ ప్రథమ చికిత్స కోసం అచ్చెన్నాయుడును పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నేరుగా అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి పరామర్శించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్లో స్పందిస్తూ, అచ్చెన్నాయుడు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు.
[subscribe]