రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు (గురువారం) ఉదయం కీలక తీర్పును ప్రకటించిన విషయం విదితమే. మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. చంద్రబాబు స్పందించారు. గడచిన రెండు సంవత్సరాలుగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఆనాడు నన్ను నమ్మి రాజధాని కోసం రైతులు వేలాది ఎకరాలను తమంతట తామే స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించటానికి ముందుకొచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని అమరావతిపై అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేశారన్నారు. రాజధానిని తరలించే ప్రయత్నం చేశారని.. అయితే దానిని అడ్డుకోవటానికి రైతులు, స్థానిక ప్రజలు, మహిళలతో సహా 807 రోజులుగా ఆందోళన చేశారని చంద్రబాబు తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమం ఆవశ్యకతను ఇతర జిల్లాలకు తెలియజెప్పేందుకు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని ప్రశంసించారు. చివరికి న్యాయమే గెలుస్తుందని హైకోర్టు తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. ఈ విజయం ఐదు కోట్ల ఆంధ్రులదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హైకోర్టు సూచనలను అమలుచేయాలని, రైతులకు అభివృద్ధి చేసిన భూమిని అందించాలని చంద్రబాబు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ