ఏపీలో మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.ఈరోజు అంటే శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే ఏప్రిల్ 29 వరకూ నామినేషన్ల విత్ డ్రా చేసుకోవడానికి గడువు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్దుల సంఖ్య తేలుతుంది. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి 5 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. అలాగే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి వెయ్యి వరకూ నామినేషన్లు వచ్చాయి. అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్ల అఫిడవిట్లను ఎన్నికల అధికారులు సీఈవో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. మరోవైపు ప్రధాన పార్టీలు వైఎస్సార్సీపీ, తెలుగు దేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అధినేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న స్థానాల్లో ఓ మోస్తరుగా నామినేషన్లు దాఖలయ్యాయి.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ స్ధానంలో మొత్తం 45 నామినేషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం స్థానంలో మొత్తం 32 నామినేషన్లు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం స్థానంలో మొత్తం 30 నామినేషన్లకు పైగా దాఖలయ్యాయి.
నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్ధానంలో 71 నామినేషన్లు వచ్చాయి. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం స్థానంలో మొత్తం 19 నామినేషన్లు వచ్చాయి. పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంట్ స్ధానంలో మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానంలో 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్ల అఫిడవిట్లను ఎన్నికల అధికారులు సీఈవో వెబ్ సైట్ లో అప్ లోడ్ పూర్తయ్యాక.. ఈ సంఖ్యలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY