గాజువాక వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ను ..గంగవరం పోర్టు సమ్మె వెంటాడుతోంది. 20 రోజులుగా అదానీ గంగవరం పోర్టు.. నిర్వాసిత ఉద్యోగుల సమ్మె వల్ల మూతపడింది. అయితే విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సిన ముడిసరకు అక్కడ చిక్కుకుపోవడంతో.. దీని ప్రభావం స్టీల్ ప్లాంట్పై పడింది. గంగవరం నిర్వాసిత గ్రామాలు, ఉక్కు నగరం గాజువాక అసెంబ్లీ పరిధిలోనే ఉండడం, ఈ సమస్య ఇప్పుడు ఎక్కువ కావడం, వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేయడంతో..ఈ ప్రభావం ఇప్పుడు గుడివాడ్ అమర్నాధ్ గెలుపుపై పడింది.
నిజానికి ఎన్నికల కోడ్ రాకముందు నుంచి కూడా గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగుల సమస్య కొనసాగుతోంది. 6 నెలల క్రితం ఇదే సమస్యపై.. జిల్లా కలెక్టర్ వద్ద అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి, ఎంప్లాయిస్కు మధ్య చర్చలు జరగగా కొన్నింటిపై అంగీకారం కూడా కుదిరింది. కానీ అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం..చర్చల సమయంలో అంగీకరించిన షరతులను నేటికీ అమలు చేయలేదు.
మరోవైపు పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాధ్ కూడా తన సొంత జిల్లాలోని ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. పరిశ్రమల శాఖపై పెద్దగా పట్టు లేకపోవడంతో.. కోడిగుడ్డు మంత్రిగా పేరుపడి అభాసు పాలైన గుడివాడ.. అదానీ పోర్టు వ్యవహారంలో ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉండడం, సమస్య గాజువాకలో ఉండడంతో ఈసమస్యతో తనకేమీ సంబంధం లేనట్లే వ్యవహరించారు. కానీ ఇప్పుడు వైసీపీ అభ్యర్ధిగా గాజువాకకు మారడంతో గుడివాడకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
తమను స్వచ్ఛంద పదవీ విరమణ చేయిస్తే వెంటనే రూ.35 లక్షలు చెల్లించాలని లేదంటే తమను ఉద్యోగంలో కొనసాగిస్తే రూ.36 వేల జీతం ఇవ్వాలని గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. నిబంధనల మేరకు పోర్టు ఆవరణలోనే ఒక ఆస్పత్రిని నిర్మించాలని కోరుతున్నారు. నిజానికి ఇవన్నీ కోరరాని కోరికలు కావు.. హేతుబద్ధమైన డిమాండ్లే. పక్కనే ఉన్న విశాఖ పోర్టులో ఇంతకంటే ఎక్కువ పరిహారం, జీతం లభిస్తుంది. అయితే రెండు రోజుల క్రితం ఈ డిమాండ్ల మీద లేబర్ కమిషనర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.
గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరవాత తమ స్వప్రయోజనాల కోసం..అదానీకి ఈ వాటాలను అతి రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ చర్చలలో పెద్దగా పాత్ర ఏమీ లేకుండా పోయింది. దీనికి తోడు అదానీతో సీఎం జగన్ సన్నిహితంగా ఉంటుండడంతో.. జిల్లా అధికారులు కూడా ఈ చర్చలలో అదానీ యాజమాన్యం చెప్పింది వినడం తప్ప .. తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు ఇటు అసెంబ్లీ అభ్యర్థి అమర్నాధ్ పీక మీద కత్తిలా కూర్చుంది. అంతేకాకుండా.. అటు లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కూడా ఈ సమస్య ఇబ్బందికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY