టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడ చేరుకున్న పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు, అభిమానులు సింధుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, విజయవాడలో తనకు ఘన స్వాగతం లభించిందని చెప్పారు. “ఒలింపిక్స్ కు వెళ్లేముందు సీఎం వైఎస్ జగన్ నాకు సపోర్ట్ చేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్ లో పతకం తేవడం సంతోషంగా, గర్వంగా ఉంది. కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిముషాలు బ్లాంక్ అయ్యాను.సెకండ్ టైమ్ ఒలింపిక్ పతకం దేశానికి తేవడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను. నాపై అభిమానం చూపిన వారందరికి పతాకాన్ని అంకితం చేస్తున్నా. జాతీయ జెండా ఎగురుతూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది” అని సింధు పేర్కొన్నారు.
రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు అమ్మాయి ఒలింపిక్స్ లో పతకం సాధించడం సంతోషంగా ఉంది. “రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నా. చిన్న వయసులోనే రెండు పతకాలు తేవడం దేశానికి గర్వకారణం. యువతకి సింధు రోల్ మెడల్ గా నిలుస్తుంది. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలి. సింధుకి విశాఖలో అకాడమీకి కోసం సీఎం వైఎస్ జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారు” అని చెప్పారు.
మరోవైపు పీవీ సింధు శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి పీవీ సింధుకు పట్టు వస్త్రాలు, అమ్మవారి ప్రసాదములు, చిత్రపటంను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ