ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో టీటీడీ కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి పాలకమండలిలో అవకాశం కల్పించింది. అక్టోబర్ 23, బుధవారం నాడు టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ అయింది. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులకు కల్పించవలసిన వసతులు, దర్శన సమయంలో అందించే సేవలు, ఇతర మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుందని సమాచారం.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగుల పదోన్నతులు, తిరుపతిలో చేపట్టే కార్యక్రమాలు, తిరుపతి గరుడ వారథి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు చెందిన పెట్టుబడులు వంటి అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించే అవకాశం ఉంది.
[subscribe]