మే 28, గురువారం నాడు టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే తిరుపతి నుంచి సమావేశంలో పాల్గొంటున్నారు. మిగిలిన పాలక మండలి సభ్యులంతా స్వస్థలాల నుంచే పాల్గొననున్నారు. టీటీడీ చరిత్రలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.
టీటీడీ ఆస్తుల విక్రయాలపై ఈ సమావేశంలో నిర్ణయించి కీలక ప్రకటన చేయనున్నారు. మరోవైపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆస్తులపై రాజకీయ వ్యతిరేకతతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీటీడీ ఆస్తులు విక్రయించాలని చూసారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తే అప్పటినుంచే భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇక స్వామి వారి లడ్డు ప్రసాదాలకు ఎక్కువ డిమాండ్ ఉందని, పలు ప్రాంతాల వాసులు శ్రీవారి ప్రసాదాలు అందించాలని టీటీడీని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu