ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాదిలో విశాఖపట్నం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైజాగ్ టెక్ సమ్మిట్-2023కు కేంద్రం తన మద్దతుని ప్రకటించింది. ఈ మేరకు గ్లోబల్ టెక్ సమ్మిట్ నిర్వాహకులు పెరల్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ శ్రీనుబాబు గేదెల నేతృత్వంలోని ప్రతినిధులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. గురువారం ఆమె గ్లోబల్ టెక్ సమ్మిట్ బృందాన్ని కలుసుకున్న సందర్భంగా తన మద్దతును తెలిపారు. కాగా వచ్చే ఏడాది ఆరంభంలో ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ఈ వైజాగ్ టెక్ సమ్మిట్-2023 నిర్వహించనున్నట్లు వారు ఆర్థిక మంత్రికి తెలిపారు. ఇక ఈ సమ్మిట్ ద్వారా ఆరాష్ట్రానికి రూ.3,000 కోట్ల పెట్టుబడులను ఆశిస్తున్నట్లు ప్రతినిధులు ఆమెకు వివరించారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఈ టెక్ సమ్మిట్ భారతదేశంలోని శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించుకోవడంపై ప్రపంచదేశాలకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. అలాగే పారిశ్రామిక ఆటోమేషన్లో సాఫ్ట్వేర్ను ఏకీకృతం చేయడానికి ఇదొక అద్భుతమైన ప్రయత్నం అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక భారతదేశం ఇటీవలే జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వైజాగ్ టెక్ సమ్మిట్ వేదికగా జీ-20 విజన్ ను వెల్లడించాల్సిందిగా ఆమె సూచించారు. ఈ వైజాగ్ టెక్ సమ్మిట్-2023ను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం తరఫునుంచి అన్ని విధాలా సంపూర్ణ అహకారం అందిస్తామని ఆమె సమ్మిట్ ప్రతినిధులకు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ