ఈ నెల 18వ తేదీన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో నిర్వహించే ‘కౌలు రైతు భరోసా యాత్ర’ పోస్టర్ ను గురువారం తెనాలిలో జిల్లా నాయకులతో కలసి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు భరోసా లేకుండా చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏడాదికో పాలసీ తెచ్చి ప్రణాళికాబద్దంగా రైతులకు నష్టం చేస్తోందన్నారు. కొత్త చట్టంతో కౌలు రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులకు జనసేన పార్టీ అండగా నిలుస్తోందన్నారు. కౌలు రైతు కుటుంబాలకు బాసటగా నిలిచే కార్యక్రమం చేపట్టినట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి సుమారు 300 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అందించనున్నట్టు చెప్పారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని ధైర్యం నింపారు.
అన్నపూర్ణగా పేరున్న గుంటూరు జిల్లాలోనూ రైతులు చితికిపోయారు:
“ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లి నియోజకవర్గంలో సభ నిర్వహించనున్నాం. అన్నపూర్ణగా పేరుగాంచిన గుంటూరు జిల్లాలో రైతాంగం చితికిపోయింది. మూడు నెలలుగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి కౌలు రైతుల ఆత్మహత్యలపై కసరత్తు నిర్వహించాం. రైతు స్వరాజ్య వేదిక అనే ఎన్జీవోతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, ఎఫ్ఎస్ఐఆర్ కాపీలు, పోస్టుమార్టం కాపీలతో సహా సేకరించాం. జిల్లావ్యాప్తంగా మాకు వచ్చిన లెక్క 281 మంది కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా బాధాకరం. అన్నపూర్ణ లాంటి జిల్లాలో ఇది ఊహించని పరిస్థితి. గతంలో గుంటూరు జిల్లా రైతులు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచి ఎంతో పేరు సంపాదించారు. ఆ పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితికి దిగజారిపోవడం బాధ కలిగించింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. మిర్చి, పత్తి రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేని పరిస్థితుల్లో భవిష్యత్తు మీద ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఆరుగురు ప్రాణాలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకి మరో నాలుగు చొప్పున వినతిపత్రాలు పార్టీ దృష్టికి వస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి జనసేన కార్యకర్త, జిల్లా రైతాంగం మద్దతుగా నిలిచి విజయవంతం చేయాలని కోరుతున్నాం” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE