కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా గురువారం నాడు శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం చేరుకున్న అమిత్ షాకు శ్రీశైలం దేవస్థానం వేదపండితులు పూర్ణకుంభంతో ఎదురొచ్చి, మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శనం చేయించారు. అలాగే ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి అమిత్ షా చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు వచ్చారు.
సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద అమిత్ షాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్షా పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ