దేశంలో మరో ఐదుగురు సీనియర్ కాంగ్రెస్ నేతల ఖాతాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాను ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లాక్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను కూడా ట్విట్టర్ ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా లాక్ అయిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ పార్టీ వెల్లడించింది. “కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ ఇండియా లాక్ చేసింది. మోదీ జీ, మీరు ఎంత భయపడుతున్నారు?, కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క స్వాతంత్య్రం కోసం పోరాడింది, సత్యం, అహింస మరియు ప్రజల అభీష్టాన్ని మాత్రమే కలిగి ఉంది. అప్పుడు మేం గెలిచాం, మళ్లీ గెలుస్తాం” అని కాంగ్రెస్ పార్టీ ఇన్స్టాగ్రామ్ లో ప్రకటన చేసింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ట్విట్టర్ ఖాతాలు కూడా తాత్కాలికంగా లాక్ అయినట్టు కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్ ఝా వెల్లడించారు. ముందుగా ఢిల్లీలో గత వారం జరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటనకి సంబంధించి, బాలిక తల్లిదండ్రులతో కలిసిన దిగిన ఫోటోలను ట్వీట్ చేసిన అనంతరం రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. భారతీయ చట్టం ప్రకారం బాధితురాలు లేదా ఆమె బంధువుల ఫోటోలను షేర్ చేయడంపై నిషేధం ఉంది, అలాగే ఇది తమ పాలసీ ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని ట్విట్టర్ పేర్కొంటూ రాహుల్ గాంధీ ఖాతాపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే తమ నిబంధనలను ఉల్లంఘించారని పలువురు కాంగ్రెస్ నాయకుల ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ