విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి చుట్టుపక్కల 3 కి.మీ మేరకు వ్యాపించింది. దీంతో స్థానిక ప్రజల్లో కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల ఎదుర్కొని, ఏమి జరుగుతుందో తెలియక ఎక్కడివారు అక్కడే కుప్పకూలిపోయారు. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలతో సృహ తప్పారు. ప్రమాదాన్ని గుర్తించిన ప్రజలు ఇళ్లనుంచి పరుగులు తీశారు. రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే దాదాపు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. అపస్మారక స్థితిలో రోడ్లపై పడిపోయిన వారిని అంబులెన్స్లలో స్థానిక అధికారులు వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరికొంతమంది ప్రజలు ఏమిజరుగుతుందో తెలియక భయానికి గురై తలుపులు మూసేసి ఇళ్లలోనే ఉండిపోయారు. రసాయన వాయువు ప్రభావం ఎక్కువవకుండా పరిశ్రమ చుట్టూ పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను వారి ఇళ్లనుంచి వేరే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైరన్ మోగించి ప్రభావిత ప్రాంతంలో ప్రజలను ఇళ్ళు ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యంగా వృద్దులు, పిల్లలు, మహిళలు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. వందలాది పశువులు, మూగ జీవాలు, పక్షులు మరణించాయి. మరోవైపు వాయువు ధాటికి ప్రభావ ప్రాంతంలో చెట్లు సైతం ఎండిపోయాయి. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా, ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందిస్తూ, ఎల్.జి.పాలిమర్స్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ అని, లాక్ డౌన్ అమలులో పరిశ్రమలకు సడలింపులు ఇచ్చాక తిరిగి ప్రారంభించారని చెప్పారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్ వాయువు లీకైందని, ప్రజలు నిద్రమత్తులో ఉండి ఈ వాయువు పీల్చడం వలన అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని, పరిస్థితి అదుపులోకి తీసుకువస్తామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu