ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఉగాది నాటికీ సంతృప్తికర స్థాయిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని చెప్పారు. భూముల సమగ్ర రీసర్వేను ఎటువంటి పొరపాట్లు జరగకుండా త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామ వాలంటీర్లు అర్హులైన వారిని గుర్తిస్తారని తెలిపారు.
భూముల రీసర్వే, కౌలు దారుల రక్షణ చట్టంపై భూయజమానులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ చర్చించారు. భూముల రీసర్వే ప్రణాళికను అధికారులకు వివరించారు. ఈ రీసర్వేకు రూ.1,688 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిపారు. గ్రామాల్లో 14 లక్షల మందికి, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రస్తుతం గుర్తించిన భూమితో గ్రామాల్లో, పట్టణాల్లో కలిపి 11 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూమి ఉందని, ఇంకా 15 లక్షలమందికి పైగా ఇళ్ల స్థలాల కోసం భూమిని సమకూర్చుకోవాల్సి ఉందని ఈ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షకు అధికారులతో పాటు రెవిన్యూ శాఖమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు.
[subscribe]
[youtube_video videoid=Vcy8mhh3tt8]