అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 35 అసెంబ్లీ స్థానాలకు.. 3 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్లను మార్చేశారు. మరో నాలుగైదు రోజుల్లో అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న జనసేన, తెలుగు దేశం పార్టీలు కూడా గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
ఈసారి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తు నేపథ్యంలో జనసేన ఏయే స్థానాల్లో పోటీచేయాలనే విషయంలో.. మెజార్టీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందట. ఒకటి రెండు, స్థానాలు మిగిలి ఉండగా.. ఆయా స్థానాలపై నేతలు చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే ఆ స్థానాలను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే జనసేన, తెలుగు దేశం పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు.. అభ్యర్థుల జాబితాను సంక్రాంతి తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో వైసీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ జాబితా వచ్చిన తర్వాత.. ఆ పార్టీ అభ్యర్థులను బట్టి ఏవైనా మార్పులు చేర్పులు చేసి తమ జాబితాను ప్రకటించాలని జనసేన, తెలుగు దేశం పార్టీలు భావిస్తున్నాయట. అందుకే తాము పోటీ చేయబోయే స్థానాలను సంక్రాంతి ముందే ప్రకటించాలని జనసేన, తెలుగు దేశం పార్టీలు భావించినప్పటికీ.. ఇప్పడు వాయిదా వేశాయి.
ఇక జనసేన పోటీ చేయబోయే స్థానాలు అత్యధికంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉన్నాయట. అలాగే నాలుగు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి తర్వాతే టీడీపీ, జనసేన గెలుపు గుర్రాలు గ్రౌండ్లోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY