తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, రాష్ట్రము రోగాల తెలంగాణా లాగా మారిందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం అయిన చొరవ చూపి చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. రాష్ట్రంలో ప్రజలు ఎదురుకుంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. గ్రామాలు మొదలుకుని, మహానగరం హైదరాబాద్ వరకు ప్రజలు రోగాల బారినపడి ఇబ్బందులు పడుతున్నారని, స్వయంగా పరిశీలించినట్టు చెప్పారు.
మందుల సరఫరా, వైద్యుల కొరత, పారామెడికల్ స్టాఫ్, నిధుల కొరత లాంటి అనేక అంశాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని చెప్పారు. ఆగస్టు 19వ తేదీ నుండి జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. గతంలో నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని ప్రభుత్వానికి సూచించిన కూడ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తిరిగి తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ తరుపున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ మార్పులపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మినవారు పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=0XfvS_b7DiU]