కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని లేఖలో సీఎం వైఎస్ జగన్ కు సూచించారు. అలాగే పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను మోదీ మరిచిపోయారన్నారు.
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామని, కొత్తగా ఏమీ కోరడం లేదని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కేంద్రం చిత్తశుద్ధితో పనిచేయాలని కేవీపీ కోరారు. ఏపీలోయువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు రకాల పరిశ్రమల స్థాపనకు కృషిచేయాలన్నారు. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం లెక్కకట్టి ఇవ్వాలని, దేశంలోని మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలదొక్కుకునేంత వరకు సహాయ సహకారాలు అందించాలని ఈ లేఖలో ప్రధాని మోదీని కేవీపీ కోరారు.
[subscribe]