టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. 64 సంవత్సరాల గౌతంరాజు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం వేకువజామున ఆయన మరణించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఎడిటర్గా గౌతంరాజుకు పేరు ఉంది. ‘చట్టానికి కళ్ళు లేవు’ సినిమాతో ఎడిటర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇప్పటివరకు ఆయన 850 సినిమాలకు పైగా ఎడిటర్గా వ్యవహరించడం విశేషం.
ఇక గౌతంరాజు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలకు ఎడిటర్గా వ్యవహరించారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్గా ఆయన నంది అవార్డు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు ఎడిటర్ గౌతంరాజే కావడం గమనార్హం. కాగా గౌతంరాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతంరాజు కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ