హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించని సంగతి తెలిసిందే. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. 10 సీట్లు గెలిచినా జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా మద్ధతుతో హర్యానాలో బీజేపీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 25, శుక్రవారం సాయంత్రం దుష్యంత్ చౌతాలా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం, బీజేపీ పార్టీకి సీఎం పదవి, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరిందని అమిత్షా ప్రకటించారు. హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతోనే బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్టు దుష్యంత్ చౌతాలా ప్రకటించారు.
అక్టోబర్ 26, శనివారం నాడు బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై పార్టీ నేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే పార్టీ మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడంతో ఆయన ఎంపిక లాంఛనమే కానుంది. ఈ సమావేశం తరువాత మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్ను కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఆరుగురు స్వతంత్ర్య అభ్యర్థులు సైతం బీజేపీకే మద్ధతు ప్రకటించారు. హర్యానా లోక్ హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా కూడ బీజేపీకి మద్ధతు ఇస్తానని ప్రకటించడం, అటు విపక్షాలు, సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు రావడంతో బీజేపీ ఆయన విషయంలో వెనక్కు తగ్గింది. దీపావళీ అనంతరం ఖట్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
[subscribe]