తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 22 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లోని మఖ్దుంభవన్ లో చేపట్టిన ఈ దీక్షను సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ, ఆర్టీసీ ఆస్తులను చేజిక్కించుకునేందుకే సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ అనేది వ్యాపార సంస్థ కాదని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజా రవాణా వ్యవస్థ అని గుర్తుంచుకోవాలని అన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి మొదట మద్దతుగా తానే ఉన్నానని, ఇపుడు కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని తెలిపారు.
[subscribe]