ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 26, శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, కార్మిక సంఘాలతో చర్చలు జరపబోతున్నట్టు సమాచారం. శుక్రవారం నాడు ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సుమారు నాలుగు గంటలపాటు ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల అధ్యయనం అనంతరం ఈడీల కమిటీ తమ నివేదికను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు సమర్పించారు, నివేదికను ఆయన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కు ఇవ్వగా, మంత్రి ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రికి అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈడీల కమిటీ ఇచ్చిన నివేదిక, హైకోర్టు ఆదేశాలపై చర్చించిన తరువాత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ పక్కనపెట్టి, హైకోర్టు పరిశీలించమని చెప్పిన ఇతర డిమాండ్లపై, కార్మిక సంఘాలతో చర్చలు జరపమని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చర్చలకు సంబంధించి అధికారకంగా ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విషయంపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వం నుంచి చర్చలకు ఎటువంటి పిలుపు రాలేదని, ఒకవేళ పిలిస్తే వెళ్తామని తెలిపారు.
[subscribe]