మహారాష్ట్రలో మరోసారి బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటింది. అయితే మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది. 2014 లో 260 స్థానాల్లో పోటీచేసి 122 చోట్ల గెలువగా, ఇప్పుడు 150 స్థానాల్లో పోటీ చేసి 105 సీట్లు గెలుచుకున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ ఎన్నికలో బీజేపీ-శివసేన పార్టీలు కూటమిగా పోటీచేసి చేసి మెజారిటీ మార్కును విజయవంతంగా దాటగలిగాయి. బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి, అయితే 50-50 పదవీకాలం అంశం తెరపైకి రావడంతో ఏ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు, ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకుని గతంలో కంటే చెప్పుకోదగిన స్థాయిలో పుంజుకున్నాయి.
మరో వైపు హర్యానా రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీకి జేజేపీ, స్వతంత్రుల మద్ధతు అవసరం కానుంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ నాయకులతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఏ పార్టీకి మద్ధతు ఇచ్చే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. బీజేపీ దూకుడుగా వ్యవరిస్తున్న నేపథ్యంలో, దుష్యంత్ చౌతాలాకు సీఎం అభ్యర్థిగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర, హర్యానాలలో మరోసారి బీజేపీ కి మరోసారి అధికారాన్ని చేపట్టే అవకాశం దక్కడం అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంత్రులుగా కూడ పనిచేసిన అనుభవం లేకపోయినా దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్ లాల్ ఖట్టర్ లు ముఖ్యమంత్రులుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని తెలిపారు. బిజెపి-శివసేన కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించినందుకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారిని అభినందించారు.
[subscribe]