ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మెడ్టెక్ జోన్లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లు తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 8, బుధవారం సచివాలయంలో మంత్రి గౌతమ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ నెల చివరికల్లా రాష్ట్రంలో రోజుకి 3 నుంచి 4 వేల పరీక్షలు చేసేలా కిట్లు తయారు చేస్తున్నామని తెలిపారు.
ఈ టెస్టింగ్ కిట్లతో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, పీసీఆర్ టెస్టులు చేయవచ్చని మంత్రి గౌతమ్రెడ్డి తెలిపారు. వీటి ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని చెప్పారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా చేస్తామని అన్నారు. అదే విధంగా ఏప్రిల్ 15 నుంచి వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రంలో మాస్కులు, పీపీఈలు తయారుచేసేందుకు అనుమతిచ్చామని, మే నెల నాటికి 7.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తామని అన్నారు. ఈ పీపీఈలు రాష్ట్ర అవసరాలకు ఉంచుకుని, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు సరఫరా చేస్తామని మంత్రి గౌతమ్రెడ్డి స్పష్టం చేశారు.