కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఫిబ్రవరి నుండి అంతర్జాతీయ రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోకి రావాలనుకుంటున్న లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే భారతీయులు, విదేశీయులు మరియు ఇతర వర్గాలకు సంబంధించిన వీసా మరియు ప్రయాణ ఆంక్షలను దశల వారీగా సడలింపులు ఇవ్వాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. పర్యాటక(టూరిస్ట్) వీసా మినహా ఇతర అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్టు కేంద్ర హోమ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఓసీఐ, పీఐఓ కార్డ్ హోల్డర్లు మరియు ఇతర విదేశీ పౌరులెవరైనా విమానాశ్రయాలు మరియు ఓడరేవు ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా అనుమతించబడతారని పేర్కొన్నారు. వందే భారత్ మిషన్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ ఏర్పాట్లు లేదా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించిన షెడ్యూల్ కాని వాణిజ్య విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులనైనా అనుమతిస్తామని కేంద్రం వెల్లడించింది. అటువంటి ప్రయాణికులందరూ క్వారంటైన్, ఇతర ఆరోగ్య/కోవిడ్-19 విషయాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
ఈ దశల వారి సడలింపులు కింద ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలను (ఎలక్ట్రానిక్ వీసా, టూరిస్ట్ వీసా మరియు మెడికల్ వీసా మినహా) తక్షణమే పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి వీసాల చెల్లుబాటు గడువు ముగిసినట్లయితే, కొత్త వీసాలను సంబంధిత భారతీయ సంస్థల నుంచి నుండి పొందవచ్చని చెప్పారు. అలాగే వైద్య చికిత్స కోసం భారతదేశానికి రావాలనుకునే విదేశీ పౌరులు వారి వైద్య సహాయకులతో సహా మెడికల్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu