దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్రం పలు సూచనలు చేసింది. హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగర్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాష్టాల ఆరోగ్య కార్యదర్శులు, జాతీయ ఆరోగ్యమిషన్ ఎండీలతో శనివారం నాడు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డా.వినోద్ కే పాల్ సమీక్ష నిర్వహించారు. ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కరోనా కేసుల పెరుగుదలను గుర్తించినట్టు తెలిపారు. ఢిల్లీలో 9 జిల్లాలు, హర్యానాలో 15, ఆంధ్రప్రదేశ్ లో 10, ఒడిశాలో 10, హిమాచల్ ప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ లో 7, గోవాలో 2, చండీగర్ లో 1 జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో వెంటనే కరోనా పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. ఈ జిల్లాల వలన ఇతర రాష్ట్రాలకు కూడా కరోనా వ్యాపించే ప్రమాదం ఉన్నందున అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలి:
అలాగే టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ అనే త్రిముఖ వ్యూహాన్ని తప్పకుండా కొనసాగించాలని చెప్పారు. ఇటీవల పరీక్షల సంఖ్య తగ్గిన జిల్లాలలో మళ్ళీ కరోనా పరీక్షలు పెంచాలని, ముఖ్యంగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లపై నిఘా పెట్టి, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. నమోదైన ఒక్కో పాజిటివ్ కేసు నుంచి సోకే అవకాశమున్న కనీసం 20 మందిని గుర్తించి పరీక్షలు జరపాలని చెప్పారు. మరణాలు ఎక్కువుగా నమోదవుతున్న జిల్లాల్లో చికిత్స మీద దృష్టి సారించాలని సూచించారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని, ప్రైవేట్ ఆస్పత్రులతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా కరోనా వ్యాపించే పరిస్థితి కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాల్లో వ్యాప్తి నిరోధానికి వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ