పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో చట్టంగా అమలులోకి తీసుకురావడానికి రాష్ట్రపతి వద్దకు పంపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11, గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో పౌరసత్వ సవరణ బిల్లు-2019 చట్టంగా మారింది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రాజపత్రం(గెజిట్) విడుదల చేసింది. లోక్ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటువేయగా, రాజ్యసభలో అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 92 మంది ఓటేశారు. ఈ చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన దాడులు, హింస కారణంగా ఇబ్బందులు ఎదుర్కోని డిసెంబర్ 31, 2014కు ముందు భారతదేశానికి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన్, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు.
మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారడంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం గువాహటిలో కర్ఫ్యూ విధించింది. అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను సైతం నిలిపివేశారు. అయితే రాజ్యాంగంలోని క్లాజ్ 6 కిందికి వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. అలాగే ఇన్నర్ లైన్ పర్మిట్ కిందకు వచ్చే కొన్ని ప్రాంతాలకు కూడా ఈ చట్టం నుంచి మినహాయింపు నిచ్చారు.
[subscribe]