సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిన్న రెండు ముఖ్య కేసుల విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల గౌరవానికి భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, న్యాయమూర్తులపై ప్రభుత్వం దూషణలకు పాల్పడే కొత్త ధోరణి కనిపిస్తోందని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మాజీ ఐఏఎస్ అధికారిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న ఛత్తీస్గఢ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేసిన కేసులో న్యాయవ్యవస్థపై చేసిన కొన్ని ఆరోపణలపై జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ఎస్సీ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే మరో కేసు, 2020లో మాజీ సీఎం రమణ్సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన భార్యపై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసిన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వులపై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వ్యాఖ్యలపై స్పందించిన సీజేఐ ఎన్వీ రమణ.. “మీరు ఎలాంటి పోరాటం చేసినా ఫర్వాలేదు. అయితే కోర్టులను కించపరిచే ప్రయత్నం చేయకండి, ప్రభుత్వం న్యాయమూర్తులను దూషించడం ప్రారంభించింది. ఇది దురదృష్టకరం.. మేము కోర్టులో కూడా దీనిని చూస్తున్నాము. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రెండ్. ఇంతకు ముందు ఈ తరహా ఎత్తుగడలతో ప్రైవేట్ పార్టీలను చూసేవాళ్లం. కానీ, ప్రభుత్వాలే ఇలా వ్యవహరించడం రాజ్యాంగ వ్యవస్థలకు మంచిది కాదు. దీని దుష్ఫలితాలు భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమిస్తాయి” అని తెలిపారు. ఇంకా, తన కేసును రుజువు చేసే పత్రాలను దాఖలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కూడా పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 18న విచారించనున్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ