మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారని మాతృభూమి ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కరోనా సమయంలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం వెంటనే సంపూర్ణ మద్య నిషేధాన్నిఅమలు చేయాలని కోరారు.
అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, ప్రభుత్వం రాష్ట్రంలో మద్య నిషేధానికి కట్టుబడి ఉందని, దశలవారీగా దాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే అనేక సార్లు ప్రకటించిందని చెప్పారు. ఇరువర్గాల వాదన విన్న అనంతరం మే 13, బుధవారం లోపులో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్నీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu