కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముందుగా గత ఆగస్టు 25న తరుణ్ గొగోయ్ కరోనా బారిన పడ్డారు. కరోనాకు రెండు నెలల పాటుగా చికిత్స తీసుకున్న ఆయన ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం ప్రభావితం కావడంతో మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల నుంచి ఆయనకు వెంటిలేటర్ సపోర్టుతో డాక్టర్లు వైద్యం అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం తరుణ్ గొగోయ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
తరుణ్ గొగోయ్ తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అస్సాంలో కాంగ్రెస్ నేతగా అత్యంత కీలకంగా వ్యవహరించారు. అస్సాంలో 2001 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి వరుసగా మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఆయన ఆరు సార్లు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తరుణ్ గొగోయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ